సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గాంధీ ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకే ఎన్నికలకు ముందు రైతులను ప్రధాని మోదీ క్షమాపణ కోరారని వ్యాఖ్యానించారు. 600 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా, లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లినా ప్రధాని మోదీ చలించలేదని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. రైతులు ఆందోళనజీవులను, గుండాలని, ఉగ్రవాదులని, దేశద్రోహులని ప్రభుత్వ నేతలు విమర్శలు చేశారని, అన్ని మాటలంటుంటే ప్రధాని ఎందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని, నిరసన చేపడుతున్న రైతుల్ని ఆందోళనజీవులను ప్రధానియే స్వయంగా అన్నట్లు ప్రియాంకా ఆరోపించారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని మీరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేది ఎలా అని ప్రశ్నించారు.