Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘ఎయిడెడ్‌’ మేలు కోసమే !

మంచి చేయాలన్నదే ఉద్దేశం
అవకాశాల వినియోగం ఐచ్ఛికం, స్వచ్ఛందం
బలవంతపు స్వాధీనాలు ఉండవు
సీఎం జగన్‌ వివరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని, దీనిపై రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం సందర్భంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, దీనిపై జగన్‌ సమగ్ర వివరణ ఇచ్చారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఈ అవకాశాలు వెనుక కారణాలను సీఎం వివరించారు. గతంలో బాగా డబ్బు, ఆస్తిపాస్తులున్నవారు చారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం అన్నది ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఇంకోవైపు ప్రభుత్వాలు కూడా గడచిన 20-25 సంవత్సరాలుగా ఎయిడెడ్‌ పోస్టులను భర్తీచేయకపోవడంతో ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇలా చేశాయి. దీనివల్ల యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్‌ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో ఎయిడెడ్‌ స్కూళ్లను, కాలేజీలను నడపడానికి మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. యాజమాన్యంలోని వ్యక్తులకు ఈ విద్యాసంస్థలను నడిపేందుకు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సంస్థల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. ఈ కారణాలన్నీ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. రిటైర్‌ అయిన టీచర్ల స్థానే కొత్తవారిని నియమించుకోవడం యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒకవేళ టీచర్లను పెట్టినా క్వాలిటీ లోపించింది. ఇంకోవైపు వాటిల్లో పనిచేసే టీచర్లు తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని, ప్రభుత్వంలో భాగం కానీయకుండా తమ కడుపులు కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల వెనుకున్న ఉద్దేశాల రక్షణకు, ఎయిడెడ్‌ యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించింది. నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే…. నాడు-నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీకింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటు ఇది. అలాగే తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో, వారిని సరెండర్‌ చేసి, ప్రయివేటుగా నడుపుకోవచ్చు. లేదా ఇప్పుడు ఉన్నట్టుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచి చేయాలని, మెరుగైన స్కూళ్లగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వారు వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img