మంత్రి విడదల రజిని బంధువులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఏపీ హైకోర్టు మురికిపూడి గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజిని , కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బంధువులు ప్రతాప్రెడ్డి, దినేష్ రెడ్డి, శ్వేతారెడ్డి, శివపార్వతికి నోటీసులు ఇచ్చింది. గ్రానైట్ తవ్వకాలపై ఎన్వోసీ ఇచ్చిన తహసీల్దార్తో సహా పలువురికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 21.50 ఎకరాల స్థలంలో తమకు తెలియకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసి ఇవ్వడంపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డి.కె. పట్టాలు రద్దు చేయకుండా తవ్వకాలు జరిపారని పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు విన్ని కోర్టు స్టేటస్ కో విధించింది. ఈ భూముల్లో ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉంది. అయితే స్థాని రైతులకు తెలియకుండానే ఎన్వోసీ ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారు.మురికిపూడిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుపేదలకు ప్రభుత్వం బీ-ఫాం పట్టాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ భూముల్లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఎన్వోసీ ఇచ్చింది.. దీంతో స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలు ఇచ్చిన భూముల్లో ఒకవేళ ఖనిజాలు ఉంటే ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకొవచ్చు. అయితే బీ ఫాం పట్టాదారుడికి ముందుగా సమాచారం ఇచ్చి.. సదరు వ్యక్తి అంగికారంతోనే తీసుకోవాలనే నిబంధన ఉందని చెబుతున్నారు.కానీ పట్టాదారులకు ఎలాంటి సమాచారం లేకుండా మైనింగ్ లీజుకు ఎన్వోసీ ఇవ్వడంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. అయితే ప్రభుత్వ అధికారులు వాదన మరోలా ఉంది.. గతంలో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి.. ఆ భూములు వెనక్కి తీసుకున్నాకే మైనింగ్ లీజుకు ఎన్వోసీ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. అంతేకాదు రికార్డుల్లో వాగుగా ఉన్న భూమిలో గ్రానైట్ తవ్వకాలకు అనుమతలు ఇస్తే నీటి లభ్యత తగ్గిపోతుందని.. గోతులు ఏర్పడతాయని స్థానికులు అంటున్నారు.