విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ నేతృత్వంలో జరిగిన కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బోపన్న వరహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ పేర్లను జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు.
ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దినెలల తేడాలోనే మరో ఏడుగురు న్యాయమూర్తుల నియామకం జరగడం, హైకోర్టులో పెండిరగ్ కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడనుంది.
మొత్తం 21 మందికి పదోన్నతి
న్యూదిల్లీ: దేశంలోని వేర్వేరు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 21 మంది న్యాయాధికారులకు పదోన్నతులు కల్పించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్తో కూడిన కొలీజియం తమ సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురి పేర్లు ప్రతిపాదించగా అలహాబాద్ హైకోర్టుకు ప్రతిపాదించిన తొమ్మిది మందిలో రేణు అగర్వాల్, మహమ్మద్ అజర్ హుస్సేన్ ఇద్రీసి, రామ్మనోహర్ నారాయణ్ మిశ్రా, జ్యోత్న్సా శర్మ, మయాంక్ కుమార్ జైన్, శివశంకర్ ప్రసాద్, గజేంద్ర కుమార్, సురేంద్ర సింగ్`1, నలిన్ కుమార్ శ్రీవాత్సవ ఉన్నారు.
కర్ణాటక హైకోర్టు కోసం ప్రతిపాదించిన ఐదుగురిలో అనిల్ భీమ్సేన్ కట్టి, గురుసిద్ధయ్య బసవరాజ, చంద్రశేఖర్ మృత్యుంజయ జోషి, ఉమేశ్ మంజునాథ్ భట్ అడిగ, తల్కాడ్ గిరిగౌడ శివశంకర గౌడ ఉన్నారు. కొలీజియం తాజా సిఫార్సులను సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో పొందుపర్చారు.