ఏప్రిల్ నుంచి పారాసెటమాల్తో సహా 800 అత్యవసరమైన మందుల ధరల పెంపు
ఇప్పటికే ఓ వైపు నిత్యావసరాలు, మరోవైపు గ్యాస్ చమురు ధరల పెంపుతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్, బీపీ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి దేశంలో పారాసెటమాల్తో సహా 800 అత్యవసరమైన మందుల ధరలు 10.7శాతం పెరగనున్నాయి.2021 క్యాలండరు సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచికను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మెజారిటీ సాధారణ జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్లో దాదాపు 800 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి.వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం అందించిన డేటా ఆధారంగా మందుల ధరలు పెంచినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటీసులో పేర్కొంది. ఈ నిర్ణయంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, రక్తహీనత వంటి వాటికి వాడే మందుల ధరలు పెరగనున్నాయి. ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడాజోల్ వంటి మందుల ధరలు పెరగనున్నాయి.