దేశవ్యాప్తంగా రెండు దఫాలుగా సోదాలు, అరెస్ట్ల తర్వాత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం కొరడా రaలిపించింది. వాటిపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు నిర్దారణకు వచ్చిన కేంద్రం.. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ , గుజరాత్ , కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే కేంద్రం పీఫ్ఐపై నిషేధంవిధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో ఇటీవల ఎన్ఐఏ నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా పీఎఫ్ఐను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తీవ్రవాద నిధులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్ఐ నిషేధం విధించింది. ఆ సంస్థపై నిషేధం విధించడంతో పీఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడిరచాయి. అనుబంధ సంస్థలు – రిహాబ్ ఇండియా ఫౌండేషన్ , క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా , ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ , నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్, కేరళలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 27 తేదీల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), పలు రాష్ట్ర పోలీసులు పీఎఫ్ఐపై దేశ వ్యాప్త దాడులు చేపట్టింది. తొలి దఫా దాడుల్లో పీఎఫ్ఐకి చెందిన 106 మందిని, రెండవ రౌండ్ దాడులలో 247 మందిని అరెస్టు చేశారు.