తల్లిదండ్రుల ఆందోళన
ప్రత్యేక పోలీసు బృందం గాలింపు
విశాలాంధ్ర`తిరుపతి క్రైమ్ : స్థానిక నెహ్రునగర్లోని అన్నమయ్య మీడియం స్కూల్ విద్యార్థులు ఐదుగురు బుధవారం ఉదయం అదృశ్యమైన సంఘటన నగరంలో సంచలనం కలిగించింది. ఉదయం 8.30 గంటల సమయంలో పదో తరగతి చదువుతున్న మోహత, మౌన, గున, అబ్దుల్ రెహమాన్, తొమ్మిదో తరగతి చదువుతున్న అతిఫ్ ట్యూషన్కు వచ్చి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ట్యూషన్ దగ్గరకు వెళ్లి అడగ్గా విద్యార్థులు ఇంటికే బయలుదేరారని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెదికినా పిల్లలు కనబడకపోవడంతో కంగారుపడ్డారు. వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థులు చదువుకుంటున్న ట్యూషన్ వద్దకు వెళ్లి ఉపాధ్యాయులను ఆరాతీశారు. సీసీ పుటేజ్ను పరిశీలించారు. పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికివెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో కూడా రికార్డయింది. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారో అనేది తెలియలేదు. ప్రత్యేక టీమ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సీఐ శివప్రసాద్ తెలియజేశారు.