డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నా..వ్యాధి తీవ్రత గత వేరియంట్ల కంటే తక్కువేనని వస్తున్న వార్తలపై డబ్ల్యూహెచ్వో తీవ్రంగా స్పందించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతమకమైన వేరియంటే అని హెచ్చరించింది. ఇది తేలికపాటి వ్యాధి అని చెప్పడంలో అర్ధం లేదని స్పష్టంచేసింది. ఒమిక్రాన్ బాధితులు కూడా ఆసుపత్రుల్లో చేరుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహచ్వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు. ఈ వేరియంట్ను తేలికపాటి వ్యాధిగా పరిగణించడం సరైందికాదన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు. ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా కొన్ని దేశాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని చెప్పారు. గత వేరియంట్ బాధితులు లాగే ఈ వేరియంట్ బాధితులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది కూడా మనుషుల్ని చంపేస్తోంది. సునామీలా కేసులు పెరుగుతూ యావత్ ప్రపంచంలోని ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. అని హెచ్చరించారు. టీకా వినియోగంలో సంపన్న దేశాల స్థార్థపూరిత చర్యల వల్లే కొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవించేందుకు అస్కారం కలిగిందని అన్నారు. టీకా అసమాతలే ప్రజల మరణాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ చివరిదని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్వో కొవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. భవిష్యత్తులో ఎట్లాంటి వేరియంట్లు వస్తాయో చెప్పలేమని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, వైరస్ నుంచి రక్షణకు తప్పకుండా నిబంధనలు పాటించి తీరాలని కోరారు.