Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఏకగ్రీవంగా ఆమోదించిన రాజ్యసభ
ఇక రాష్ట్రపతి సంతకమే తరువాయి
బిల్లుపై వాడివేడి చర్చ

న్యూదిల్లీ : ఓబీసీ జాబితాలను సొంతంగా రూపొందించుకునే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలపగా బుధవారం రాజ్యసభ ఓకే చేసింది. రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారడమే ఇక మిగిలింది. రాజ్యాంగ(127 సవరణ) బిల్లు 2021ని రాజ్యసభ ఆమోదించింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలను రాజ్యసభ పరిగణనలోకి తీసుకుంది. బిల్లును ఏ ఒక్క సభ్యుడు వ్యతిరేకించలేదు. అంతకుముందు ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్య సభలో చర్చ జరిగింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ల కోసం ఓబీసీల జాబితాను సొంతంగా తయారు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకు పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. పెగాసస్‌, మూడు వ్యవసాయ చట్టాలు తదితర సమస్యలపై మూడు వారాలుగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న వివాదాలను పక్కనపెట్టి ఓబీసీ బిల్లుపై సజావుగా చర్చించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి పెగాసస్‌, రైతు వ్యతిరేక చట్టాలపై చర్చకు ప్రతి పక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే మోదీ సర్కారు మొండి పట్టుదలతో చర్చకు అనుమతించకుండా పార్లమెంటు సమయాన్ని వృథా చేసింది. రాజ్యాంగ(127వ సవరణ) బిల్లు 2021ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖమంత్రి వీరేంద్రకుమార్‌ సభలో ప్రవేశ పెడుతూ ఓబీసీల జాబితాను సొంతంగా తయారు చేసుకునే అధికారా లను రాష్ట్రాలకు పునరుద్ధరించేందుకు ఈ బిల్లు దోహద పడుతుందని చెప్పారు. అతి కీలమైన ఈ బిల్లు తీసుకు రావడానికి సహకరించిన ప్రధాని మోదీ, రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ బిల్లు చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు ద్వారా దాదాపు 671 కులాల లబ్ధిపొందుతాయని, దేశంలో ఐదింట ఒక వంతు ఓబీసీలు ఉన్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారికి గొప్ప మేలు జరుగుతుం దని మంత్రి చెప్పారు. ఓబీసీల ప్రయోజనాలు, సంక్షేమం కోసం పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం

సంతోషంగా ఉందన్నారు. ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను మంత్రి ఏకరువు పెట్టారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి రాష్ట్రాలకు అధికారాలు పునరుద్ధరించేందుకు రాజ్యాంగ సవరణ అత్యవసరమని వ్యాఖ్యానించారు. ఓబీసీల రిజర్వేషన్‌లను గతంలో సుప్రీంకోర్టు తొలగించిన విషయం విదితమే.
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జునఖర్గె మాట్లాడుతూ బిల్లుపై చర్చకు కేవలం మూడు గంటల సమయం మాత్రమే కేటాయిం చారని, దీనిని మరింత పెంచాలని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సభా నాయకుడు పీయూష్‌ గోయల్‌..నాలుగు గంటల పాటు చర్చించడానికి అంగీకరించారు. అయితే, ఈరోజు లిస్టు చేసిన అజెండాను సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసేందుకు సహకరించాలని గోయల్‌ సహా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన మరికొన్ని బిల్లుల ఆమోదానికి సహకరించాలని విన్నవించారు. అతికీలకమైన ఓబీసీ బిల్లుపై మాట్లాడటానికి చిన్న పార్టీలకు సైతం ఎక్కువ సమయం కేటాయించాలని ఆర్‌జేడీ సభ్యుడు రaా, శిరోమణి అకాలీదళ్‌ సభ్యుడు నరేశ్‌ గుజ్రాల్‌ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌ సభ్యులు రాజ్‌మణి పటేల్‌ మాట్లాడుతూ కోర్టును సంప్రదించడం ద్వారా ఈ బిల్లు తీసుకురావాలనని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఓబీసీలకు మంచి చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే కమండలం జోళికి వెళ్లవద్దని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ఓబీసీలకు కాంగ్రెస్‌ రిజర్వేషన్‌ కల్పించిందని చెప్పారు. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం దానిని కొనసాగించలేదని ఆరోపించారు. తమిళనాడు సైతం పోరాటం ద్వారా 69శాతం రిజర్వేషన్లు పొందుతోందని తెలిపారు. పశువుల గణనను చేపడుతున్న ప్రభుత్వానికి ఓబీసీ గణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కుల గణనను ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండు చేశారు. ప్రతిభావంతులను రిజర్వేషన్‌ జాబితాలో చేర్చవద్దని హితవు పలికారు. ఈ బిల్లు ఓబీసీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని టీఎంసీ`ఎం నేత జీకే వాసన్‌ చెప్పారు. ఆప్‌ సభ్యుడు సంజయ్‌సింగ్‌ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ఓబీసీ సంక్షేమం గురించి ప్రభుత్వం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఓబీసీ నివేదికను ప్రస్తావిస్తూ వారికి కేటాయించిన టీచరు పోస్టులు భర్తీ చేయలేదని ఆరోపించారు. హత్రాస్‌ అత్యాచారం, హత్య కేసును, యూపీ, గుజరాత్‌లలో దళితులపై జరిగిన అత్యాచారాలను సంజయ్‌సింగ్‌ ప్రస్తావించారు. సంజయ్‌సింగ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేశ్‌ సమర్ధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img