. ఇసుక మాఫియాను అరికట్టాలి… సంక్షేమ బోర్డును కాపాడుకుంటాం
. జగన్,మోదీకి బుద్ధి చెబుతామని నినదించిన వందలాది మంది కార్మికులు
విశాలాంధ్ర`రాజమహేంద్రవరం : ఏఐటీయూసీ పోరాట ఫలితంగా ఏర్పడిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పాలకుల విధానాల నుంచి కాపాడుకుంటామని, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తామని వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులు రాజమండ్రి నగరంలో నినదించారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏడవ జాతీయ మహాసభలు ఈనెల 26 నుంచి 28 వరకు జరుగుతున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ప్రదర్శన రంభ, ఊర్వశి, మేనక సెంటర్, అప్సర థియేటర్, జాంపేట, దేవి చౌక్ మీదుగా కంబాల చెరువు సెంటర్కు చేరుకుంది. ఈ ప్రదర్శన అగ్ర భాగాన యూనియన్ జాతీయ అధ్యక్షులు విజయన్ కునిసెరి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహీదా నిజాం, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రవి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు వి.రత్నాకర్ రావు, జాతీయ కార్యదర్శి ఎం.ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.వి.కొండలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ, రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్.నారాయణ, కోశాధికారి పందిళ్ల భాను ప్రసాద్, యూనియన్ జిల్లా కార్యదర్శి కలిశెట్టి అచ్చం నాయుడు, జిల్లా అధ్యక్షులు నాలం వెంకటేశ్వరరావు, జట్లు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మసాని రవిచంద్ర, చింతలపూడి సునీల్, సీపీఐ కాకినాడ జిల్లా కార్యదర్శి బోడకొండ, మహిళా సమాఖ్య నాయకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.