. దిల్లీకి మారిన సిద్ధ, డీకే బల ప్రదర్శన
. ఆదివారం రాత్రే పూర్తయిన అభిప్రాయ సేకరణ… రహస్య ఓటింగ్
. ఇప్పుడు అందరి కళ్లూ అధిష్ఠానం పైనే
. నా బలం 135: డీకే శివకుమార్
న్యూదిల్లీ/బెంగళూరు: కన్నడ నాట కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన తర్వాత సీఎం కుర్చీపై కుస్తీలు మొదలయ్యాయి. సీఎం ఎవరనే విషయమై ఆ పార్టీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం పదవి కోసం పోటీ పడుతు న్నారు. ఇద్దరిని దిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆహ్వానం పంపింది. అయితే సిద్ధరామయ్య దిల్లీ వెళ్లగా, శివకుమార్ మాత్రం వెళ్లలేదు. తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 135 ఎమ్మెల్యేలు గెలిచారని, తాను ఒంటరినని ఆయన చెప్పారు. సీఎం పదవి విషయంలో పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ నేత సూర్జేవాలాతో సమావేశం ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం డీకే శివకుమార్ తన ఇంటికి చేరుకొని మద్దతుదారులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఆయన మద్దతుదారులు డీకేకు సీఎం పదవిని ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయమై శివకుమార్ ఆసక్తిగా ఉన్నారు. దీంతో మాజీ సీఎం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచారని తెలుస్తోంది. మొత్తంగా సీఎం పదవి కోసం బల ప్రదర్శన దిల్లీకి మారింది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, తీవ్రమైన సంప్రదింపులు, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ, అలాగే ‘రహస్య బ్యాలెట్’ ద్వారా ముందస్తు నిర్ణయం తీసుకోవడంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు శిబిరాలను సంతృప్తి పరచడంపై పార్టీ అధిష్ఠానం తలపెట్టి ‘ఫార్ములా’పై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తదుపరి సంప్రదింపుల కోసం అగ్రనేతలు ఇద్దరినీ పార్టీ అధిష్ఠానం దిల్లీకి పిలిపించింది. సిద్ధరామయ్య బెంగళూరు నుంచి దిల్లీ బయలుదేరి వెళ్లారు. శివకుమార్ రాత్రి తర్వాత ఆయనను అనుసరించే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నియమించిన ముగ్గురు కేంద్ర పరిశీలకులు సోమవారం దేశ రాజధానికి తిరిగి వచ్చారు. కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను పరిశీలకులు క్రోడీకరించి నివేదికను సోమవారం రాత్రికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేకు అందజేస్తారని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. పార్టీ సీనియర్ నాయకుడు బి.కె.హరిప్రసాద్ మాట్లాడుతూ పరిశీలకులతో సంభాషించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎంపికపై బహిరంగ అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు కోరారని, సీఎం పేరు కోసం రహస్య బ్యాలెట్ కూడా జరిగిందని చెప్పారు. తమతోపాటు బ్యాలెట్ బాక్సులను పరిశీలకులు దిల్లీకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఖడ్గే త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనాయకులతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని పెద్ద ఎత్తున బలప్రదర్శనగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ అనేక మంది ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం వెలుపల సిద్ధరామయ్య, శివకుమార్ మద్దతుదారులు తమ నేతే తదుపరి ముఖ్యమంత్రిగా పేర్కొంటూ నినాదాలు చేశారు. పార్టీ గెలిచిన వెంటనే ఇద్దరు నేతల మద్దతుదారుల మధ్య పోస్టర్ల యుద్ధం కూడా జరిగింది. సీఎంను ఎన్నుకునే అధికారం పార్టీ అధినేతకు ఇస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే, పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియాను కర్నాటక సీఎల్పీ నేత ఎన్నికకు పరిశీలకులుగా ఖడ్గే నియమించారు. బెంగళూరు నుంచి దిల్లీకి వచ్చిన కర్నాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలాతో పాటు ముగ్గురు నేతలు సాయంత్రం తర్వాత ఖడ్గేతో సమావేశం కానున్నారు. ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో విందు అనంతరం కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలందరితోనూ పరిశీలకులు వ్యక్తిగతంగా మాట్లాడి అర్థరాత్రి ప్రక్రియను పూర్తి చేశారు.
నేను ఒంటరి మనిషిని…
గెలిపించి నిరూపించా: డీకే శివకుమార్
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య, పార్టీ సీనియర్ సహచరుడు సిద్ధరామయ్యకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారనే ఊహాగానాల మధ్య రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం మాట్లాడుతూ తన బలం 135 అని, తన అధ్యక్షతన, పార్టీ చెప్పిన సీట్ల సంఖ్యను అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్నట్లు చెప్పారు. సిద్ధరామయ్యతో పాటు తనను కూడా అధిష్ఠానం దిల్లీకి పిలిపించిందని, వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా వెళతానని చెప్పారు. ‘మేము ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి వదిలివేస్తామని మేము ఏక వాక్య తీర్మానం చేశాము. ఆ తర్వాత కొందరు వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇతరుల సంఖ్య గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. నా బలం 135. నేను పార్టీ అధ్యక్షుడిగా, నా అధ్యక్షతన కర్నాటకలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం, అవినీతి పాలన, ప్రజల కష్టాలకు వ్యతిరేకంగా పార్టీ 135 సీట్లు గెలుచుకుంది. ప్రజలు మమ్మల్ని ఆదరించి 135 సీట్లు గెలిపించారని శివకుమార్ అన్నారు. ఇతర నాయకుల వాదనలపై ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని శివకుమార్, ‘నేను ఒంటరి మనిషిని. ధైర్యం కలిగిన ఒక్క వ్యక్తి… మెజార్టీ సాధించగలడని నమ్ముతా. నిరూపించాను కూడా. 2019లో అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా… ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. గత ఐదేళ్లలో ఏమి జరిగిందో నేను బహిర్గతం చేయదలచుకోలేదు. భవిష్యత్తులో వెల్లడిస్తాను’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం, ఐక్యతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, అయితే సమయం సరిపోలేదని, స్థానిక స్థాయి నుంచి మరింత సహకారం ఉంటే మరింత మెరుగ్గా పని చేసి సంఖ్యలు మరింత పెంచుకునేవాళ్లమని అన్నారు. ‘కానీ మేము సంతోషంగా ఉన్నాము’ అని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను, సిద్ధరామయ్యను దిల్లీకి పిలిపించిందని పేర్కొన్న శివకుమార్, అక్కడికి వెళ్లడం ఆలస్యం కావచ్చునని అన్నారు. ‘ఈ రోజు నా పుట్టినరోజు అయినందున చాలా మంది నాకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారు. నేను నా కుటుంబంతో కలిసి నా దేవతను దర్శించుకోవాలి. అక్కడికి వెళ్లిన తర్వాత, నేను దిల్లీకి బయలుదేరతాను. నేను దిల్లీకి ఎప్పటికి వెళతానో నాకు తెలియదు. అందుబాటులో ఉన్న విమానంలో నేను వెళతాను’ అని అన్నారు. తన నియోజకవర్గంలో తాను ముద్దుగా పిలుచుకునే ‘సాతనూరు పులి’ కర్నాటక సీఎం అవుతాడా అన్న ఒక ప్రశ్నకు, ఈ విషయాన్ని మల్లికార్జున్ ఖడ్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి వదిలేస్తానని చెప్పారు. అయితే సిద్ధరామయ్య అన్ని వర్గాలలో ప్రజాదరణ పొందారు. 2013 నుంచి 2018 వరకు పూర్తి ఐదేళ్ల ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం కలిగి ఉన్నారు. ఇక శివకుమార్ బలమైన సంస్థాగత సామర్థ్యాలను కలిగి ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పరిగణించబడ్డారు. ప్రబలమైన వొక్కలిగ సంఘం, దాని ప్రభావవంతమైన ప్రజలు, నాయకుల మద్దతు ఆయనకు ఉంది.