ఒక్క రోజులో 10 వేల మంది మృతి
7లక్షలకు పైగా కొత్త కేసులు
అమెరికా, బ్రిటన్, ఇరాన్లో వైరస్ వ్యాప్తి ఉధృతం
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క రోజు (24 గంటల వ్యవధి)లో అన్ని దేశాల్లో కలిపి 10వేల మంది ప్రాణాలను కబళిం చింది. కొత్తగా 7 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అమెరికా, బ్రిటన్, ఇరాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో అత్యధికంగా 1.43 లక్షల కేసులు నమోదు కాగా 660 మంది మృత్యువాత పడ్డారు. కరోనా డెల్టా వేరియెంట్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు, బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోసు ఇవ్వాలని సూచించింది. అమెరికాలోని 3 శాతం మంది జనాభా అదనపు డోసుకు అర్హులని అధికా రులు తెలిపారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. బ్రిటన్లో జులై 23 తర్వాత అత్యధికంగా ఒక్కరోజులో 33,074 కరోనా కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. డెల్టా వేరియంట్ కారణంగానే కేసుల పెరుగుదల నమోదైందని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్లోని 60 శాతం జనాభా రెండు డోసుల వాక్సిన్ తీసుకోగా.. మిగిలిన వారికి సైతం వీలైనంత వేగంగా టీకాలు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు. కరోనా నిబంధనలను పాటించ కపోతే మరో తీవ్రమైన కరోనా ముప్పు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిం చారు. ఆస్ట్రేలియాలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం న్యూసౌత్వేల్స్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 390 మంది వైరస్ బారిన పడి నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర రాజధాని అయిన సిడ్నీలో జూన్ 26 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. ఆగస్టు 28 నాటికి వైరస్ క్రమంగా తగ్గు ముఖం పడుతుందని భావిస్తున్నారు. ఇరాన్లో 39 వేలకు పైగా కేసులు బయట పడ్డాయి. 568 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 43,20,266కు చేరగా.. మరణాల సంఖ్య 96,215కు పెరిగినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.