ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు జనానికి గుబులు పుట్టిస్తున్నాయి. సౌతాఫ్రికా పొరుగు దేశమైన బోత్సవానాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. బి.1.1.529 అనే కొవిడ్ కొత్త వేరియంట్ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లుగా ఎన్ఐసీడీ తెలిపింది. దక్షిణాఫ్రికాలో అనేక రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్న కొత్త వేరియంట్ను నిపుణులు గుర్తించారు. కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తిని నిపుణులు, డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. ఈ కొత్త వేరియంట్పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. కొత్త వేరియంట్ అసాధారణ రీతిలో భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురవుతున్నట్లు లండన్లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ ఓ రీసెర్చ్లో తెలిపింది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియదంటున్న నిపుణులు ఫ్యూచర్లో వైరస్ వ్యాప్తి పెరిగితేనే ముప్పు అంటున్నారు. ఈ వార్తతో భారత్ అలర్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, వారికి కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని సూచించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. కాగా కర్నాటకలో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. ధార్వాడ్లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది స్టూడెంట్స్కు కరోనా సోకింది. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.