ప్రత్యర్థి పార్టీలపై మోదీ ఎదురుదాడి
లక్నో: కరోనా టీకాలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఎదురుదాడి చేశారు. ప్రత్యర్థి పార్టీల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని, అందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. వర్చువల్ విధానం ద్వారా మోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా ఉత్తరప్రదేశ్ చాలా లబ్ధి పొందిందని, వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నడిపిందని మోదీ చెప్పారు. కేంద్ర బడ్జెట్ రైతులు, సమాజంలోని ఇతర వర్గాల ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించినందుకు యోగికి ప్రధాని అభినందనలు తెలిపారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా నేరస్తులు, మాఫియా పీచమణిచారని చెప్పుకొచ్చారు. యూపీలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో మోదీ వర్చువల్గా మాట్లాడారు.
మోదీ ఉత్తరాఖండ్ ప్రచారం రద్దు
వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం ఉత్తరాఖండ్లో నిర్వహించాలని వర్చువల్ సమావేశం రద్దయినట్లు బీజేపీ తెలిపింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేసిన తర్వాత మోదీ ప్రచారాన్ని రద్దు చేయాలని స్థానిక నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ మీడియా ఇన్చార్జి మన్వీర్సింగ్ చౌహాన్ చెప్పారు. మోదీ ప్రచార కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేస్తామని బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ చెప్పారు.