డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
భారత్లోని వివిధ రాష్ట్రాలలో ఒమిక్రాన్ మరో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ కొత్త ఉప-వేరియంట్ 10 భారతీయ రాష్ట్రాల్లో గుర్తించినట్లు ఇజ్రాయెలీ నిపుణుడు పేర్కొన్న కొద్ది రోజుల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్ బీఏ.2.75 ఉనికిని ధృవీకరించింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో బీఏ.2.75 అనే ఒక ఉప-వేరియంట్ ఆవిర్భావం ఉందని తెలిపారు. ఈ ఉప-వేరియంట్ స్పైక్ ప్రోటీన్ యొక్క రిసెప్టర్-బైండిరగ్ డొమైన్పై కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఉప-వేరియంట్ మనుషుల్లో ఉండే రోగనిరోధక లక్షణాలను దాటి ప్రవర్తిస్తుందో, వైద్యపరంగా మరింత తీవ్రంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం అధ్యయనం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడే ఇది ప్రమాదకారినా, కాదా అన్నది చెప్పలేమన్నారు. భారత్లో వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తోందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు. భారత్ సహా అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటన దేశంలో ఫోర్త్వేవ్పై భయాందోళన కలిగిస్తోంది.