Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

వ్యాక్సినేషన్‌లో గొప్ప విజయం సాధించాం
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం

కరోనా మహమ్మారిపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, దేశం సాధించిన ప్రగతి, సురక్షిత భవిష్యత్‌ కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోందో వివరించారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘స్వాతంత్య్ర అమృతోత్సవ్‌’ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ నివాళులు తెలియజేశారు. దేశంలో వచ్చే పాతికేళ్లు పునాదులు పటిష్టంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో ముందకు వెళ్తోందని అన్నారు. హర్‌ ఘర్‌ జల్‌ ఇనేషియేటివ్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఆరు కోట్లకు పైగా ట్యాప్‌ వాటర్‌ సౌకర్యం కల్పించిందని చెప్పారు. దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు. కీలక విధానాల్లో రైతులు, చిన్నరైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. 2020-21 కోవిడ్‌ మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండిరచారని, 33 కోట్ల హార్టీకల్చర్‌ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం ద్వారా కోవిడ్‌పై పోరాటం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారని ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. ఏడాదిలోపే 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. భారత వ్యాక్సిన్లు కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని అన్నారు. అర్హులైన 90శాతం కంటే ఎక్కువ మంది మొదటి డోసు తీసుకున్నారని అన్నారు. 70 శాతం మంది లబ్ధిదారులు రెండో డోసు కూడా తీసుకున్నారని చెప్పారు. స్వాతంత్య్రం, సమత్వం, సామరస్యం ఆధారిత సమాజమే ఆదర్శ సమాజమని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పునాదులు ప్రజలను గౌరవించడంలోనే ఉందని, బాబాసాహెబ్‌ మార్గదర్శక సూత్రాలు, సిద్ధాంతాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.ఫార్మారంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా ఫార్మారంగం అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆయుర్వదం, దేశవాళీ చికిత్స వంటివి కూడా ప్రభుత్వ పథకాలంతో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. పేద ప్రజల హెల్త్‌కేర్‌కు ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి హెల్త్‌కేర్‌ సంక్షోభాన్నైనా నివారించేందుకు రూ.64,000 కోట్లతో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ మిషన్‌ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img