విశాలాంధ్ర`బెంగళూరు: కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఏడు స్థానాలలో పోటీ చేస్తోంది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిస్తోంది. పార్టీ తరపున ఆలంద నుంచి మౌలముల్ల, సిరా నుంచి గిరీశ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)లో జ్యోతి బసు, కూడ్లిగిలో వీరన్న, మూడిగేరేలో కలేగూర్రమేష్, మేలు కోటేలో దర్శన్, మడికేరిలో సోమప్ప సీపీఐ అభ్యర్థులుగా పోటీచేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాతి సుందరేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవర్గి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మహేశ్ కుమార్ రాథోడ్కు రైతు సంఘాలతో పాటు తాము కూడా మద్దతిస్తున్నామని ప్రకటించారు. కోలార్ జిల్లా కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజక వర్గంలో సీపీఐ అభ్యర్థి జ్యోతి బసు వందలాది మంది కార్యకర్తలు ప్రదర్శనగా వెంటరాగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చిక్ మగలూరు జిల్లా మూడిగెరేలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కలేగూర్ రమేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాతి సుందరేశ్ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మడికేర్ నియోజకవర్గంలో సోమప్ప నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.