Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కర్నాటకలో కాంగ్రెస్‌కే ఆధిక్యం

. అన్ని అంశాల్లోనూ హస్తం పార్టీనే ముందంజ
. చరిత్ర తిరగరాసేందుకు బీజేపీ యత్నాలు
. పీపుల్స్‌పల్స్‌ సర్వేలో వెల్లడి

బెంగళూరు: కర్నాటక రాష్ట్ర శాసనసభకు ఈ నెల 10వ తేదీన జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో రాష్ట్రంలో ఏ అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్ని స్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసా గించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ ఉంది. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని పీపుల్స్‌పల్స్‌ చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామా జిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్‌ ఇతర పార్టీల కంటే ముం దుంది. కోస్తా ప్రాంతాన్ని మినహాయించి అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్‌ తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ వంద స్థానాలకు పైగ విజయం సాధించి స్వల్ప ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ వంద స్థానాలకులోపే పరిమితం కావచ్చు. ఇదేసమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా గెలుపొందవచ్చు.
సౌత్‌ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సర్వే ప్రకారం 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో 41.4 శాతం పొందే అవకాశాలు న్నాయి. 2018లో 36.35 శాతం ఓట్లు పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం ఓట్లు కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. 2018లో కింగ్‌మేకర్‌ పాత్ర పోషించిన జేడీ(ఎస్‌) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్‌ లేదా మైనస్‌ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయి. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేం. ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఈ సర్వే నిర్వహించారు.
‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్‌ సేకరిం చారు. పీపుల్స్‌పల్స్‌ ప్రతినిధులు ప్రీపోల్‌ సర్వే కోసం ఏప్రిల్‌ 25 నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ముఖాముఖిగా కలుసుకోవడంతోపాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకుంది.
ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం యెడియూరప్పకు 14 శాతం మంది, డీకే శివకుమార్‌కు 3 శాతం మంది అనుకూలంగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్‌)కు 14 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు. బీజేపీకి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వబోమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన తరువాత మూడు ప్రధాన పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాటులు భారీగా చోటుచేసుకున్నాయి. పార్టీలు విడుదల చేసిన మ్యాని ఫెస్టోలలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి.
పార్టీ ప్రాధాన్యతలో మార్పులు
దీనికి సంబంధించి సర్వేలో మూడు ప్రధాన మార్పులను గుర్తించాం.రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అత్యధికమంది భావిస్తున్నా, కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బీజేపీ మెజారిటీ సాధించవచ్చని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. కాంగ్రెస్‌కు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, బీజేపీ, జేడీ(ఎస్‌)కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని సర్వేలో తేలింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కేఆర్‌పీపీి (జనార్థన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ) వంటి చిన్న పార్టీల, ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉంది. వారు 1 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి.
వివిధ పార్టీల ప్రచార ప్రభావం: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్‌ ప్రచారంలో ముందంజలో ఉంది. గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహిం చారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రచారంలో బీజేపీకొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీలలో పాల్గొన్నారు. బీజేపీ ఇతర అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారు. బీజేపీ ప్రచారంలో అనేక మార్పుచేర్పులు కనిపిం చాయి. ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుంచి సానుకూలత కన్పిం చకపోవడంతో స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చింది. తనపై దూషణలు చేస్త్తోందని కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొనిప్రధాన మంత్రి ప్రచారం చేశారు. చివరగా బీజేపీ మతప్రాతిపదిక ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో బజరంగ్‌ దళ్‌పై నిషేధంపై భారీగా ప్రచారం చేసింది. ‘కేరళా స్టోరీ’ లవ్‌జిహాద్‌పై దృష్టి పెట్టింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలవలే ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జేడీ (ఎస్‌) దక్షిణ కర్నాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చింది. ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img