న్యూదిల్లీ: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా గోవాలో పోరు కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. చిదంబరం ‘ఏడ్వడం ఆపు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే, పరోక్షంగా బీజేపీకి ఓటు వేయడమే. గోవా ప్రజలు తెలివైన వాళ్లు అని, ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసన్నారు. ఫిబ్రవరి 14న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో ఓటమి పాలైన పక్షంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ప్రకటించారు. బీజేపీయేతర ఓట్లు కేవలం ఆప్, టీఎంసీ మాత్రమే పంచుకుంటాయని చెప్పుకొచ్చారు. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడు చిదంబరం, పాలనలో మార్పు కోసం కాంగ్రెస్ను గెలిపించాలని గోవా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘గోవాలో ఆప్, టీఎంసీలు బీజేపీయేతర ఓట్లను మాత్రమే విభజించగలవన్న నా అంచనాను అరవింద్ కేజ్రీవాల్ ధృవీకరించారు. గోవాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. పరిపాలనను మార్చాలనుకునే వారు (10 సంవత్సరాల దుష్టపాలన తర్వాత) కాంగ్రెస్కు ఓటు వేస్తారు. ఈ పాలన కొనసాగించాలనుకునే వారు బీజేపీకి ఓటేస్తారు’ అంటూ చిదంబరం వరుస ట్వీట్లు చేశారు. గోవాలో ఓటర్ల ముందు ఎంపిక స్పష్టంగా ఉందని అన్నారు. చిదంబరం ట్వీట్పై కేజ్రీవాల్ స్పందిస్తూ… ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. ‘సార్, ఏడుపు ఆపండి…మీ ఓట్లకు గండి పడుతుంది… నమ్మినవారికే గోవా ప్రజలు ఓటు వేస్తారు’ అని బదులిచ్చారు.