Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ

ఆప్‌, తృణమూల్‌ నామమాత్రమే
గోవా ఎన్నికలపై చిదంబరం వ్యాఖ్య

న్యూదిల్లీ : గోవా అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజావ్యతిరేకత కారణాలతో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చని కాంగ్రెస్‌ భావించింది. అయితే, మధ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రవేశంతో కాంగ్రెస్‌ గందరోగళంలో పడిరది. గోవాలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన పోటీదారులని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌, తృణమూల్‌ పార్టీలు అభ్యర్థులను నిలిపితే కొన్ని ఓట్లు సాధిస్తాయని, అవి బీజేపీ యేతర ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఆ పార్టీలు ఉపయోగపడతాయన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్‌ పరిశీలకుడిగా చిదంబరం పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించిందని, తృణమూల్‌ ఆకాంక్షను ఏఐసీసీ నాయకత్వం సైతం అర్థం చేసుకుందని, బహుశా త్వరలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా స్పందిస్తుందని చిదంబరం తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి తనకు అధికారిక సమాచారం లేదా సూచన ఏమీ లేదని చెప్పారు. చిదంబరం గురువారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గోవా అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్‌ వ్యూహాలు, ఎత్తుగడలు, ఇతర పార్టీలతో పొత్తులు తదితర అంశాలపై స్పందించారు. గోవాలో బీజేపీ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని చిదంబరం చెప్పారు. గోవాను గూండాలు పాలిస్తున్నారని ప్రజలకు తాము స్పష్టంగా చెప్పదలచుకున్నామన్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ చెబుతోంది గదా..ఆ పార్టీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్‌ ఎలా అర్థం చేసుకుంటుందని ప్రశ్నించగా ఆ పార్టీ వ్యూహంపై నేరుగా స్పందించడానికి ఆయన నిరాకరించారు. అయితే, తమ ఎమ్మెల్యేలను తనలో చేర్చుకున్న తృణమూల్‌ పట్ల తమకు కొన్ని అభ్యంతరాలు, ఇబ్బందులు ఉన్నాయని చిదంబరం వివరించారు. బ్లాక్‌స్థాయి నాయకులు, సర్పంచ్‌లు సహా తమ పార్టీ నాయకులకు తృణమూల్‌ భారీగా వలవేసినట్లు తమకు స్పష్టమైన, విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తామని ప్రారంభంలో తృణమూల్‌ ప్రధాన కార్యదర్శి ప్రకటించారని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారని గుర్తు చేశారు.అయితే, కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామన్న సంకేతాలు పంపిందన్నారు. గోవాలో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ కలిసి మహా కూటమి ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ గోవా ఇన్‌చార్జి మహువా మొయిత్రా ట్వీట్‌ చేసిన తర్వాత చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తృణమూల్‌ చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. ఏకంగా రాహుల్‌గాంధీతోనే చర్చ జరిగినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారం, వాస్తవదూరమైనవని చిదంబరం స్పష్టంచేశారు. గోవాలో కాంగ్రెస్‌ పార్టీ పుంచుకోవడం ఖాయం, అధికారం చేపట్టడం అనివార్యమని చెప్పుకొచ్చారు. గోవాలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పడాన్ని విశ్వసిస్తారా అని అడుగగా రాజకీయ విశ్లేషకులు అదే విషయం చెబుతున్నారని చిదంబరం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img