పోలీసుల అదుపులో రేవంత్రెడ్డి
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ‘చలో రాజ్భవన్’ ఉద్రిక్తంగా మారింది. సోమాజీగూడ నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ చేపట్టాలని నిర్ణయించగా.. పోలీసులు ఖైరతాబాద్ సర్కిల్ వద్ద అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్భవన్ వద్ద నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముందుకెళ్లడంతో ఖైరతాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మరికొందరు కార్యకర్తలు ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలుపుతూ కేంద్రానికి వ్యతిరేకంగ్షా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు భారీ ఎత్తున అక్కడి చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, అంజన్ కుమామార్లను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డుకోగా.. పోలీసులకు ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు.