దిల్లీలోని కాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొలి ఆడిట్ దినోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘కేవలం కొన్ని సంస్థలు మాత్రమే కాలక్రమంలో మెరుగుపడుతూ, మరింత శక్తిమంతం అవుతాయి. చాలా సంస్థలు ప్రాధాన్యం కోల్పోతాయి. కానీ కాగ్ మాత్రం మన వారసత్వంగా మారింది. ప్రతి జనరేషన్ దాన్ని స్పర్శిస్తోందని, కాగ్పై బాధ్యత పెరిగింది.’ అని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు అనుమానంతో, భయంతో ఆడిటింగ్ను చూసేవారని, కాగ్ వర్సెస్ గవర్నమెంట్ అన్న మైండ్సెట్ ఉండేదని, ప్రతి అంశంలోనూ కాగ్ తప్పుల్ని వెతుకుతుందని అధికారులు భావించేవారని, కానీ ప్రస్తుతం ఆ మైండ్సెట్ మారిందని, ఈ రోజుల్లో ఆడిట్ను కీలకమైందిగా భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పనులను అంచనా వేయడంలో కాగ్ అభిప్రాయాలకు అడ్వాంటేజ్ ఉందని, కాగ్ చేసే సూచనలతో వ్యూహాత్మక పురోగతి జరుగుతుందని, దాన్ని సహకారంగా భావిస్తామని అన్నారు. ఒకప్పుడు దేశంలోని బ్యాంకుల్లో వివిధ పద్ధతులు వాడేవారు. ఫలితంగా మొండి బకాయిలు పెరిగాయి. వాటిని కప్పి పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసేవారు. కానీ మేం వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు ధైర్యంగా తీసుకొచ్చామన్నారు. మనం సమస్యను గుర్తించినప్పుడే దానికి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం అని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రభుత్వ శాఖలు కాగ్ అడిగిన సమాచారాన్ని, డాక్యుమెంట్లు, డేటా, ఫైల్స్ ఇవ్వాలన్నారు. ఆర్థికలోటు, ప్రభుత్వ ఖర్చుపై కాగ్ ఆందోళనలను సరైన స్పూర్తితో స్వీకరించామని మోదీ తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో, బలంగా ఆడిట్లు సాగితేనే, వ్యవస్థ స్థిరంగా, పారదర్శంగా తయారవుతుందని ప్రధాని చెప్పారు. మంచి పద్ధతులపై కాగ్ స్టడీ చేయాలన్నారు. డేటానే సమాచారమని, భవిష్యత్తులో డేటానే చరిత్రను శాసిస్తుందని అన్నారు.