సంస్థ పగ్గాలు అందుకోనున్న లక్ష్మణ్ నరసింహన్
ప్రపంచంలోనే అత్యధిక కాఫీ షాపులు కలిగి ఉన్న అమెరికా సంస్థ స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ ఇప్పటిదాకా రెకిట్ సంస్థకు సీఈవోగా పని చేశారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసిన 55 ఏళ్ల లక్ష్మణ్ హొవార్డ్ షూల్జ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అక్టోబర్లో లక్ష్మణ్ స్టార్ బక్స్ కంపెనీలో చేరనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సీఈఓగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అప్పటివరకు షూల్జ్ సీఈఓగా కొనసాగుతారు. అయితే సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్ అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. ప్రస్తుతం స్టార్బక్స్ సంస్థ పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ద్రవ్యోల్బణం పెరుగడంతో ఆ సంస్థలో పని చేసే కార్మికులు తమకు మెరుగైన ప్రయోజనాలు, వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 200 కంటే ఎక్కువ అమెరికా స్టోర్లు గత సంవత్సరంలో యూనియన్గా మారాయి. ఆ సంస్థ పదార్థాలు, లేబర్ అత్యధికంగా ఖర్చులను ఎదుర్కొంటోంది.