సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
బ్యాంకుల సమ్మెకు మద్దతు ప్రకటన
న్యూదిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కార్పొరేట్ లూటీ జరగనివ్వబోమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చి సామాన్యులపై మరింత భారాలు మోపే విధానాలపై వెనక్కు తగ్గాల్సిందేనని మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి స్పష్టంచేశారు. బ్యాంకుల జాతీయీకరణ కోసం ముందుండి పోరాడినది సీపీఐ అని మరువరాదన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 16, 17 తేదీల్లో జరగబోయే బ్యాంకుల సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. నాడు సీపీఐ పోరాటఫలితంగా బ్యాంకుల జాతీయీకరణ జరిగిందని, తద్వారా మారుమూల గ్రామాలలో సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సామాన్యులు ప్రతి ఒక్కరికి చేరువైన బ్యాంకింగ్ వ్యవస్థను నీరుగార్చే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే చర్యలను కేంద్రప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండు చేస్తోందని ప్రకటనలో డి.రాజా పేర్కొన్నారు. ప్రజాధనాన్ని పరిరక్షించేందుకు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని, కార్పొరేట్ లూటీ జరగనివ్వమని ఆయన తేల్చిచెప్పారు.