ఏపీఎస్ఆర్టీసీకి దసరా కలిసొచ్చింది. సాధారణ టిక్కెట్ రేట్లకే ప్రత్యేక సర్వీసులతో ఆదాయం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చితే దసరా(ప్రీ)కు రెట్టింపు ఆదాయం వచ్చింది. తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగలైన దసరా, సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీలు నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేక బస్సుల్లో రద్దీ ఒకవైపు మాత్రమే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు టిక్కెట్టు ఛార్జీపై అదనంగా మరో 50శాతం వసూలు చేస్తారు. ఇది సాధారణ సగటు ప్రేక్షకులకు కొంత ఆర్థిక భారమే అయినప్పటికీ తప్పనిసరి స్థితిలో వెళ్లక తప్పేది కాదు. గత ఏడాది దసరాకు ముందు 1020 ప్రత్యేక సర్వీసులు నడిపారు. 50శాతం అదనపు రేటుతో నడిపిన ఈ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి వచ్చిన ఆదాయం రూ.2.10 కోట్లు. ఈ ఏడాది ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రయోగాత్మకంగా అదనపు రేట్లు వసూలు చేయకుండానే సాధారణ రేటుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించారు.