విద్యార్థులపై లైంగికదాడి కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు
గువహతి: అరుణాచల్ ప్రదేశ్లో కొంతకాలం క్రితం వెలుగు చూసిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. దాదాపు 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్ యుమ్కెన్ బాగ్రాకు మరణ దండన విధించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడు సింగ్తుంగ్ యోర్పెన్తో పాటు హిందీ టీచర్ మార్బోమ్ న్గోమ్దిర్లకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జవేప్లు చై సంచలన తీర్పు వెలువరించారు.
అరుణాచల్ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో లైంగిక దాడుల వ్యవహారం 2022లో వెలుగు చూసింది. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేయగా… మరికొందరు బాధితులు కూడా ఇటువంటి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. 2014-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై అతడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు తేలింది. బాధితుల్లో ఆరుగురు బాలురు కూడా ఉన్నట్లు బయటపడిరది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జులైలో దాఖలు చేసిన చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. లైంగిక దాడికి పాల్పడేముందు బాధితులకు వార్డెన్ మత్తుమందు ఇచ్చేవాడు. ఈ విషయాలు బయటకు చెప్పకూడదని బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆరుగురు బాధితులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. వార్డెన్ ఆగడాలపై ఓ మహిళా టీచర్కు బాధిత చిన్నారులు చెప్పినప్పటికీ… పై అధికారుల దృష్టికి ఆమె తీసుకెళ్లలేదని దర్యాప్తులో తేలింది. విచారణ జరిపిన పోక్సో న్యాయస్థానం వార్డెన్కు మరణశిక్ష విధించగా.. మాజీ ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో మహిళా టీచర్కు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ‘కఠినమైన, ఆదర్శప్రాయమైన శిక్ష కోరుతూ మేము చేసిన అభ్యర్థనలను కోర్టు మన్నించి… మంచి తీర్పు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము’ అని పోక్సో ప్రత్యేక కోర్టులో బాధితుల తరపున హాజరైన న్యాయవాది ఓయామ్ బింగెప్ పేర్కొన్నారు.