డాలర్తో పోలిస్తే 80 స్థాయికి క్షీణత
దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశంఅనుకున్నదే జరిగింది! రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్తో పోలిస్తే చరిత్రలో తొలిసారి 80.06కు చేరుకుంది. బీజేపీ అధికారంలో వచ్చేటప్పటికీ అంటే 2014లో రూపాయి విలువ రూ.62 నుంచి రూ.63 దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు 2022 జూలై 19న రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.80 స్థాయికి క్షీణించింది. ఇండియన్ రూపాయికి ఇది ఆల్టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రూపాయి మునుపెన్నడూ ఈ స్థాయిలో పడిపోలేదు. ఈ పతనం ఇంతటితో ఆగుతుందా? నిపుణుల ప్రకారం చూస్తే లేదనే సమాధానం వినిపిస్తోంది. రూపాయి విలువ రూ. 82 స్థాయికి కూడా పడిపోవచ్చని ఫారెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్ల నుంచి డబ్బులను వెనక్కి తీసుకెళ్లడం, డాలర్ బలపడటం (ఈ ఏడాది 10 శాతం పెరిగింది) వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొంటున్నారు.
ధరలు పెరిగేవి ఇవే..
రూపాయి పతనం వల్ల దిగుమతి చేసుకునే ప్రొడక్టుల ధరలు పైకి చేరొచ్చు. వంట నూనెలు, మొబైల్ ఫోన్స్, వాహన విడిభాగాలు, కార్లు, పలు కన్సూమర్ ఎలక్ట్రిక్ ఉత్పత్తులు వంటి వాటి ధరలు పెరగొచ్చు. అలాగే రూపాయి పడిపోవడం వల్ల ఎనర్జీ, లాజిస్టిక్స్ ధరలు పైకి చేరతాయి. దీంతో సిమెంట్ రేట్లు కూడా పైకి కదలొచ్చు. ఇంకా విదేశీ విద్య కూడా భారం అవుతుంది. ఫారిన్ టూర్లకు వెళ్లే వారిపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ దిగుమతి చేసుకుంటాం. బంగారం ధర కూడా పైకి చేరొచ్చు. ఎందుకంటే మనం గోల్డ్ను అధికంగా దిగుమతి చేసుకుంటాం. దీని వల్ల ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉన్నా కూడా మన దగ్గర ధరలు తగ్గకపోవచ్చు. లేదంటే పైకి కదిలే ఛాన్స్ ఉంటుంది.
రూపాయి పతనం వల్ల వీరికి లాభం
రూపాయి క్షీణత వల్ల నష్టాలు ఉన్నా కూడా కొన్ని రంగాలకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. ముందుగా ఐటీ కంపెనీలకు బెనిఫిట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలకు క్లయింట్స్ ఎక్కువగా విదేశాల నుంచే ఉంటారు. రూపాయి పడిపోవడం వల్ల వీరి రూపీ ఎర్నింగ్స్ పెరుగుతాయి. అలాగే ఫార్మా, గార్మెంట్స్, టీ రంగం నుంచి కూడా అమెరికా సహా ఇతర దేశాలకు ఎక్కువ ఎగుమతులు ఉంటాయి. దీని వల్ల ఈ రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.