. బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాం
. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కృష్ణానది మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీల నలో ఉందని జలశక్తి మంత్రి విశ్వేశ్వర్ తుడు వెల్లడిరచారు. రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్దిష్ట విధానం రూపొందించే బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)కి అప్పగించినట్లు తెలిపారు. వర్షా కాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ల నుంచి విడుదలయ్యే మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి చెందిన సాంకేతిక సంఘాన్ని తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. అయితే ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో సాంకేతిక సంఘం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందని పేర్కొన్నారు. ఒక నీటి సంవత్సరంలో కృష్ణా నదిలో లభించే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించింది. మిగులు జలాల వినియోగం తప్ప వాటిపై ఆంధ్రప్రదేశ్కు హక్కు ఉండబోదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్ల వారీగా కేటాయింపులు చేసేందుకు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగించడం జరిగిందని మంత్రి వివరించారు.
బీచ్ శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన
బీచ్ శాండ్తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు గనులశాఖమంత్రి జోషి తెలిపారు. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం మొదటి షెడ్యూలులోని పార్ట్ బీ కింద చేర్చిన బీచ్ శాండ్ మినరల్స్తోపాటు మరికొన్ని అటమిక్ మినరల్స్ను తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వాములు, పారిశ్రామిక సంఘాలతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. అటమిక్ మినరల్స్లో కొన్నింటిని అంతరిక్ష పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, ఇంధన రంగాలతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీకి, న్యూక్లియర్ పరిశ్రమకు విరివిగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మైనింగ్ చట్టం ప్రకారం బీచ్ శాండ్ అక్రమ మైనింగ్, రవాణా, నిల్వలను అరికట్టే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అన్నారు. అయితే దేశంలో బీచ్ శాండ్ మైనింగ్ అక్రమాలకు సంబంధించిన సమాచారం ఏదీ తమ వద్ద లేదని తెలిపారు.