ఒక్కరోజే 31,445 పాజిటివ్ కేసులు
కేరళలో గడిచిన 24 గంటల్లో 31,445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే రాష్ట్రంలో అమాంతం కేసులు పెరగడం కలకలం రేపుతోంది. మే నెలలో 30,491 కరోనా కేసులు నమోదు కాగా, మూడు నెలల తర్వాత బుధవారం మళ్లీ 30వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. కరోనా కేసులు నమోదుతో పాటు 215 మంది మరణించారు.దీంతో కేరళలో కరోనా మృతుల సంఖ్య 19,972కు పెరిగింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 4,048కరోనా కేసులు వెలుగుచూశాయి.త్రిస్సూర్ జిల్లాలో 3,865 కేసులు, కోజికోడ్ (3,680), మలప్పురం (3,502), పాలక్కాడ్ (2,562), కొల్లాం (2,479), కొట్టాయం (2,050), కన్నూర్ (1,930) అలప్పుజ ( 1,874), తిరువనంతపురం (1,700), ఇడుక్కి (1,166) పతనంతిట్ట (1,008) , వయనాడ్ జిల్లాలో 962 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ ఆసుపత్రుల్లో 26,582 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఓనం ఉత్సవాల తర్వాత కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 20 శాతానికి పైగా పెరుగుతుందని వైద్యనిపుణులు గతంలోనే హెచ్చరించారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ఇంటెన్సివ్ స్క్రీనింగ్/టెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించామని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు కొవిడ్ -19 సోకకుండా చూసుకోవాలని సూచించారు.