దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేరళలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత రెండు నెలలుగా జాతీయ టీపీఆర్ రేటు మూడుకు దిగువగా ఉంటుండగా, కేరళలో మాత్రం పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఒక్క నెలలోనే టీపీఆర్ రేటు 18 శాతానికి చేరుకుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న జిల్లాల్లో టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని వయినాడ్, పథానంథిట్ట, తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, ఈ నాలుగు జిల్లాలలో కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించారు.