గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్నగర్కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 60 ఏండ్లపాటు చిత్రపరిశ్రమకు సేవలందించిన కైకాల.. 1935, జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. మొత్తం 777 సినిమాల్లో నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి ప్రాత్రల్లో మెప్పించారు. ఒక దశలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరానిక చిత్రాల్లో రాణించిన ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన అన్నివర్గాల ప్రేక్షకుల హృదాయలను గెలుచుకున్నారు. చివరిసారిగా బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ‘మహానటుడు’ చిత్రంలో వెండితెరపై కనిపించారు. 1994లో బంగారు కుటుంబం చిత్రంలో అద్భుతనటనకుగాను కైకాలకు నంది పురస్కారం లభించింది. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలుపొందారు.