కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తాజాగా ప్రధాని బోరిస్ జాన్సన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఒమిక్రాన్ భారీ అలలా ముంచుకొస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కొత్త వేరియంట్పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. గతంలో చవిచూసిన చేదు అనుభావాల దృష్ట్యా ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపించగలదో అంచనా వేయగలమని పేర్కొన్నారు. రోజులు గడిచేకొద్దీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక్కరోజే యూకేలో 1,239 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,137కి చేరింది. ఒక్కరోజులు కేసులు 65 శాతం పెరిగాయి. కాగా డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని యూకే ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారలు పేర్కొన్నారు. అలాగే ఈ వేరియంట్పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. అయితే వ్యాధి తీవ్రతపై మాత్రం ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని చెప్పారు. బూస్టర్ ఒక్కటే దీని కట్టడికి మార్గమని సూచించారు.