కరోనా మహమ్మారి ఆర్థికంగా, సామాజికంగా కోట్లాదిమంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా కొవిడ్ కారణంగా భారతీయుల ఆయుర్ద్దాయం సగటున రెండేళ్లు తగ్గినట్లు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ తేల్చింది. బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ఆ నివేదికను పొందుపరిచారు. కరోనా మహమ్మారి వల్ల మహిళలు, పురుషుల్లో ఆయుష్షు తగ్గినట్లు తేల్చారు.2019లో పురుషుల్లో జీవితకాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారిలో 72 ఏళ్లుగా ఉంది. అయితే ఆయుష్షు రెండేళ్లు తగ్గడం వల్ల.. పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు సగటు ఆయుష్షు చేరినట్లు ఆ నివేదికలో తెలిపారు. 2020లో కోవిడ్ వల్ల 35 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువ శాతం మరణాలు సంభవించినట్లు తేల్చారు. దీనివల్లే జీవితకాలం తగ్గినట్లు స్పష్టమవుతోందని సూర్యకాంత్ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా జనన, మరణాలపై కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని పరిశీలిస్తూ ఈ అధ్యయనం చేపట్టారు.