న్యూదిల్లీ : కోవిడ్19పై సురక్షిత, సమర్థ పోరునకు వాక్సిన్ల ప్రొక్యూర్మెంట్ కోసం భారత్కు 1.5 బిలియన్ డాలర్లు అంటే రూ.11,185 కోట్ల రుణాన్ని ఏషియన్ డెవెలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) గురువారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లను ది ఏషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఇవ్వనుంది. ఏడీబీ రుణం ద్వారా 31.7 కోట్ల మంది కోసం 66.7 కోట్ల వరకు టీకాలు కొనవచ్చు. 18ఏళ్లు, ఆపై వయస్సుగల వారికి అంటే జనాభాలో 68.9శాతం మందికి రెండు టీకాలు అందజేసే భారత వాక్సినేషన్ ప్రణాళికకు మద్దతిచ్చే లక్ష్యంతోనే రుణాన్ని ఏడీబీ మంజూరు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి నాలుగు మిలియన్ డాలర్లు అంటే రూ.30 కోట్లతో టెక్నికల్ అసిస్టెంట్ కార్యక్రమం దేశంలో కొనసాగుతోంది. ఇందులో పేదరిక నిర్మూలనకు ఏడీబీ జపాన్ నిధి రెండు మిలియన్ డాలర్లు ఉన్నాయి. తమ సహకారంతో భారతదేశ వాక్సిన్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని ఏడీబీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఐరాస పిల్లల నిధి (యూనిసెఫ్) భాగస్వామ్యంతో ఈ సహకారాన్ని అందిస్తోంది. 2020లో కోవిడ్
19 క్రియాశీల ప్రతిస్పందన, వ్యయ సహకార కార్యక్రమం కోసం 1.5 బిలియన్ డాలర్లను ఏడీబీ మంజూరు చేసింది. మరో 300 మిలియన్ డాలర్ల రుణాన్ని పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి, మెరుగుదలకు, భవిష్యత్లో సంభవించే మహమ్మారులను మెరుగ్గా ఎదుర్కొనేందుకు, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం ఆమోదించింది. ఆసియా పసిఫిక్ వాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీని 2020 డిసెంబరులో ప్రారంభించగా 9 బిలియన్ డాలర్లను ఈ ప్రాజెక్టుకు అందించినట్లు ఏడీబీ వెల్లడిరచింది.