దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనల నేపథ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం సంస్థ భారత డ్రగ్ నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నది. తమ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది.తమ వద్ద కావాల్సినన్ని టీకాలు నిలువ ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీంతో ఇండియాలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి కోరిన తొలి సంస్థగా సీరం నిలుస్తోంది. అయితే జాతీయ సాంకేతిక అడ్వైజరీ గ్రూపు ఇచ్చే నివేదిక ఆధారంగా బూస్టర్ డోసుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. బూస్టర్ డోసు కావాలంటూ రాజస్థాన్, చత్తీస్ఘడ్, కర్నాటక, కేరళ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. కాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైరాలజీ నిపుణుడు భారత వైద్య పరిశోధన మండలి మాజీ డైరక్టర్ డా.టి.జాకబ్ జాన్ పేర్కొన్నారు. బూస్టర్ డోసుతో కొత్త వేరియంట్ను అడ్డుకోవచ్చన్నారు. టీకా కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టి హెర్డ్ ఇమ్యూనిటీని పెంపొందించాలి. రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసులు అందించాలన్నారు.