ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటనపై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సైనాపై చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నటుడు సిద్ధార్థ్ నేడు క్షమాపణలు తెలిపారు. సిద్ధార్థ్ తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా తను పెట్టిన కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు.బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా పెట్టిన ట్వీట్ మీద తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చారు. అయితే తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని అన్నారు. అయితే తనకు మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశం తనది కాదంటూ వివరణ ఇచ్చారు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్ పై క్షమాపణ కోరుతున్నానని అన్నారు. నటుడు సిద్ధార్థ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఆయనపై దాడి చేయడంతో దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న విధంగా ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఈ నెల 6న సిద్ధార్ధ్ రీట్వీట్ చేస్తూ ‘చిన్న కాక్తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు భారత్ను కాపడడానికి కొందరు రక్షకులున్నారు.’ అని వ్యంగ్యం ధ్వనించేలా ట్వీట్ చేశారు. దీంతో నటుడిపై విమర్మలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి, చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ నిరసన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు.