. రెవెన్యూ అధికారులు పంపిణీ చేయకపోవడం వల్లే భూ పోరాటాలు
. తక్షణం కుటుంబానికి రెండెకరాలివ్వాలి: ఆవుల శేఖర్
విశాలాంధ్ర బ్యూరో`రాయచోటి: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం గాదెల గ్రామపంచాయతీలో సర్వే నంబర్ 756లోని 256 ఎకరాలు బంజర భూముల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) రైల్వే కోడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శనివారం భూ పోరాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ , సీపీిఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి పి మహేశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సి సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పండు గోల మణి, తోపు కృష్ణప్ప ముఖ్య అతిథులుగా హాజరైనారు, మండలం అధ్యక్ష, కార్యదర్శులు మినుకు లక్ష్మీదేవి, అంది శివ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు, కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పేదలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల శేఖర్ మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి గాదెల గ్రామ పంచాయతీ అరుంధతివాడ నివాసులు సర్వే నంబర్ 756లోని 275 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున ఇవ్వాలని గత సంవత్సరం నుంచి కాళ్లలో చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ, రెవెన్యూ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని, రెవెన్యూ అధికారులు భూములు పేదలకు ఇవ్వనందునే భూపోరాటాలు చేయవలసి వస్తున్నదని చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని, తిరుపతిలో వుంటున్న గిరి అనే అగ్రకులానికి చెందిన ఒక్కనికే ఈ 275 ఎకరాలు ధారాదత్తం చేయడానికి రెవెన్యూ అధికారులకు ఆయన ఏమైనా చుట్టమా అని ప్రశ్నించారు. గాదెల, అరుంధతి వాడ నివాసులకు ఒక సెంటు సొంత భూమి కూడా లేదని, ఈ భూమిని కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని రెవెన్యూ అధికారులను శేఖర్ కోరారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసుల ప్రకారం పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని, ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు పైగా ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. పీఎల్ నరసింహులు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో వేలాది ఎకరాలు భూములు అన్యకాంతం అయ్యాయని చెప్పారు. ఈ భూ పోరాట కార్యక్రమంలో సీపీఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవర, బికెఎంయు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, సిగి చెన్నయ్య, కేశం ప్రసాద్, చిట్వెల్ మండల కార్యదర్శి సామా గంగయ్య, ఓబులవారిపల్లి మండలం గౌరవాధ్యక్షులు పోకూరు మురళి, సీపీఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్, పెనగలూరు మండల కార్యదర్శి ఆదినారాయణ, ఓబులవారిపల్లి మండల కార్యదర్శి నాగమ్మ, పుల్లంపేట మండల కార్యదర్శి సెలవు కుమార్, చిట్వేల్ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, భాస్కర, ఆర్. శంకరయ్య, కోడూరు మండల అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాజు, జై సింహా, ట్రెజరర్ విఎన్ హరికృష్ణ ప్రసాద్, గంగయ్య, కడప జిల్లా నాయకులు నాగరాజు, ఓబులవారిపల్లి మండల ఉపాధ్యక్షులు వెంకటమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.