గిరిజనుల ఆరాధ్య దైవమైన బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ఇకనుంచి ‘జన్జాతీయ గౌరవ్ దివస్’గా కేంద్రం నిర్వహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి తరహాలోనే భగవాన్ బిర్సా ముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తామని తెలిపారు. భోపాల్లో సోమవారం నిర్వహించిన ‘జన్జాతీయ గౌరవ్ దివస్’ మహాసమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో వెనుకబడిన ప్రాంతాలకు గానే మిగిలిపోయిన 100 జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి పట్టాలెక్కుతోందన్నారు. స్వాతంత్య్ర పోరాటం, జాతి నిర్మాణంలో గిరిజన కళలు, సంస్కృతి, వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు.. గోండుల రాణి దుర్గవతి సాహసం కానీ, రాణి కమలాపతి త్యాగం కానీ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. గిరిజన ప్రముఖులను, వారి సేవలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.. గిరిజన సమాజం సేవలను దేశానికి చెప్పలేదని, పరిమిత సమాచారం మాత్రమే ఇచ్చినట్లు విమర్శించారు.జన్జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. పెద్దఎత్తున ప్రజానీకం హాజరయ్యారు.