మంత్రి పదవికి, పార్టీకి లోబో రాజీనామా
పనాజీ: గోవాలో అధికార బీజేపీకి పెద్దఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రమంత్రి మైఖేల్ లోబో మంత్రి పదవికి, బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీ సామాన్యుల పార్టీ కాదని విమర్శించారు. సామాన్యుల కోసం బీజేపీ పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. గడచిన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను తమవైపునకు తిప్పుకున్న బీజేపీకి మంత్రి రాజీనామా దిగ్భ్రాంతి కలిగించింది. మైఖేల్ లోబో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిర్మించిన బీజేపీ కాదని కొంతకాలంగా లొబో విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ‘మంత్రి, ఎమ్మెల్యే పదవులకు నేను రాజీనామా చేశాను. తదుపరి రాజకీయ ప్రణాళికపై త్వరలో ప్రకటన చేస్తా. బీజేపీకి సైతం నేను గుడ్బై చెప్పాను’ అని మైఖేల్ లోబో విలేకరులకు చెప్పారు. బీజేపీ సామాన్యులకు లబ్ధి చేకూర్చే పార్టీ కాదని ఓటర్లు స్వయంగా తనతో చెబుతున్నారని లోబో పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరికపై ఆయన స్పష్టత ఇవ్వలేదు అన్ని రాజకీయ పార్టీలతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. తాను చేరబోయే పార్టీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుస్తుందని, అధికారం చేపడుతుందని తెలిపారు. లోబో ఆరోపణలను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్విట్టర్ వేదికగా కొట్టిపారేశారు. బీజేపీ పెద్ద కుటుంబమని, మాతృభూమి కోసం భక్తిశ్రద్ధలతో సేవ కొనసాగిస్తామని తెలిపారు. చిన్నాచితక ఫిరాయింపుల గురించి పట్టించుకునేది లేదని వ్యాఖ్యానించారు.