. నిధుల వినియోగానికి కేంద్రం అనుమతించిందా?
. గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖైనా రాశారా?
. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణంపై మంగళవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా సచివాలయాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించిన అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానమిస్తూ గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్ చట్టం పరిథిలో లేవని కోర్టుకి తెలియజేశారు. సచివాలయాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని తెలిపారు. గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధులు ఎలా వినియోగించారని హైకోర్టు ప్రశ్నించింది. నరేగా నిధుల వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందా ? కనీసం దీనిపై కేంద్రగ్రామీణాభివృద్ది శాఖకు లేఖ అయినా రాశారా? అని జస్టిస్ భట్టు దేవానంద్ ప్రశ్నలు సంధించారు.
దీనిపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.