ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసిన ఏసీబీ కోర్టు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని రమేశ్ ఇంటి జప్తుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. లింగమనేని రమేశ్ ఇంటిని జప్తు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటీషన్పై ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు అటాచ్మెంట్కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాల విషయాన్ని, అభ్యర్థించిన అధికారిని విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టు పేర్కొంది. మే 18న నోటీస్ ఆర్డర్ చేసినందున లింగమనేనికి దస్త్రాలు ఇవ్వాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్ కోరిన అధికారిని విచారించే అధికారం కూడా తమకు ఉందని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తన ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీ చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ లింగమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన కోర్టు.. అటాచ్ మెంట్ నోటీసుల్ని మాత్రం ఆయనకు ఇమ్మని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.