చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీకి ఓటమి తప్పదని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. తన సొంత నియోజకవర్గం చంకార్ సాహిబ్ను గెలుచుకునే పరిస్థితి చన్నీకి లేదని తెలిపారు. చన్నీ అల్లుడు ఇంటి నుంచి కోట్లాది రూపాయలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించిందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను సర్వేలు సైతం నిరూపిస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. ‘చంకార్ సాహిబ్లో చన్నీ ఓటమి చెందుతున్నట్లు మా సర్వే స్పష్టం చేసింది. చన్నీ అల్లుడి నివాసంలో కట్టల కట్టల డబ్బులను ఈడీ అధికారులు లెక్కించడాన్ని టీవీల్లో చూసిన ప్రజలు ఖిన్నులయ్యారు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ చంకార్ సాహిబ్ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. చన్నీ నివాసాలు, ఆయన అల్లుడి నివాసాలపై ఈడీ అధికారులు దాడులు చేసినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చన్నీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. చన్నీ సామాన్యుడేమీ కాదని, ఆయన గౌరవించదగిన నేత కాదని కేజ్రీవాల్ ఆరోపించారు. సాధారణ నేతగా కనిపించాలని ఆయన ప్రయత్నిస్తారన్నారు.