దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ డిమాండు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఈ ఉదయం ఓ జాతీయ మీడియా సంస్థతో రాహుల్గాంధీ మాట్లాడుతూ, ఇంధన ధరల పెరుగుదల, పెగాసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, దేశ ప్రజల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వానికి మాత్రం ఆయా అంశాలపై చర్చించడం ఇష్టంలేదని విమర్శించారు. ప్రభుత్వం తాము లేవనెత్తిన అంశాలపై చర్చించేవరకు పట్టువిడిచేది లేదని తేల్చిచెప్పారు.