ఏకకాలంలో ఐదుగురికే అనుమతి
బహిరంగ ప్రదేశాల్లో వద్దంటూ ఆదేశాలు
అమరావతి : రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రం విగ్రహ ప్రతిష్ఠలు ఏర్పాటు చేయరాదని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఏకకాలంలో ఐదుగురికి మించి వేడుకల్లో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టు పూర్తిగా సమర్థించింది. బహిరంగ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని, అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తీవ్రత కొనసాగుతుండడం, మరోవైపు ధర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వైఎస్సార్ వర్థంతి వేడుకలను, కార్పొరేషన్ల చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను వేలాది మందితో తిరునాళ్లలా నిర్వహిస్తూ, వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ నిబంధనలు సాకుగా చూపి అడ్డుకోవడాన్ని తప్పుబట్టాయి. అలాగే బార్లు, వైన్ షాపులు, సినిమా హాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం, గణేష్ మండపాలపై ఆంక్షలు విధించడం తగదని ఆందోళనలకు దిగాయి. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు కొంత ఉపశమనం కల్గించాయి.