దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
తమ పార్టీలోకి కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ప్రారంభిస్తే, పంజాబ్లోని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు సాయంత్రానికి వచ్చి చేరుతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో టచ్లో ఉన్నారన్నారు. వీరంతా తమ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ ఆ చెత్తను తీసుకోవాలనుకోవడం లేదన్నారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీని సంప్రదిస్తున్నారని అన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూను ఆ పార్టీ అణగదొక్కుతోందన్నారు. ఇసుక మాఫియా వంటి అనేక సమస్యలపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చెప్తున్న అవాస్తవాలను నవజోత్ సింగ్ సిద్ధూ బయటపెడుతున్నారన్నారు. సిద్ధూను చన్నీ అణచివేయడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని మిగిలిన పార్టీల కన్నా ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు.