విశాలాంధ్ర, చీరాల: ఇటీవల దుబాయ్ వెళ్లిచ్చిన చీరాల మున్సిపాలిటీ నాలుగో వార్డు జక్కా వారి వీధికి చెందిన ఒక మహిళకు కరోనా పరీక్షలు చేయించగా అది పాజిటివ్ రావడంతో ఒమెక్రాన్ పరీక్షలు కూడా చేసి రిపోర్ట్స్ ల్యాబ్కు పంపిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓమిక్రాన్ రిపోర్ట్స్ రాగా ఆమెకు ఒమిక్రాన్ ఉన్నట్లు తేలిందని దీంతో తగు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నామని చీరాల మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాల్గొవ వార్డును మునిసిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు,వైద్యాధికారులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఇప్పటికే నాల్గొవ వార్డు ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టామని,మళ్లీ ఓసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తామని, ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి వద్దనే ఉండి పండుగ జరుపుకోవాలని గుంపులుగా బయట తిరగవద్దని సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా నాల్గొవ వార్డుకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఇటీవల చీరాల శాంతి థియేటర్ ఎదురు కూడా లండన్ నుండి వచ్చిన ఇద్దరు యువకులు కరోనా నిర్ధారణ కావడంతో ఇంటికి తాళం వేసి హైద్రాబాద్ వెళ్లిపోవడం తెలిసిందే. వారి చిరునామా పట్టుకోటానికి అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.