Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చైనాను దాటేశాం

భారత్‌ జనాభా 142.86 కోట్లు
తొలిస్థానంలోకి

న్యూదిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడిరచింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడిరచడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023’ పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడిరచింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. 2023 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచ జనాభా 804.5కోట్లుగా అంచనా వేయగా అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్‌, చైనాలోనే ఉంటుందని అంచనా. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్‌లో కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2 శాతం పెరుగుతూ వస్తుండగా…అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7 శాతంగా ఉంది.
గతేడాది చైనా గణాంకాల ప్రకారం అక్కడ గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి భారీగా జనాభా క్షీణించినట్లు తేలింది. గతంలో ఐరాసతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఏప్రిల్‌లోనే ఈ రికార్టు నెలకొల్పనుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, జనాభాకు సంబంధించి భారత్‌, చైనా నుంచి సరైన సమాచారం అందకపోవడం వల్లే ఈ రికార్డు తేదీని కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు ఐరాస జనాభా విభాగం అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ కారణంగా జాప్యమైంది. భారత్‌లో జనాభా వేగంగా పెరగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తున్నట్లు తాజా సర్వేలో తేలిందని యూఎన్‌ఎఫ్‌పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్‌నార్‌ పేర్కొన్నారు.
అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళనకర అంశంగా చూసే బదులు పురోగతి, అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img