ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది..
సీఎం జగన్పై లోకేష్ మండిపాటు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వ తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం, గత ప్రభుత్వం చేసిన మంచిపనిని తమ ఖాతాలో వేసుకోవడం సీఎం జగన్మోహన్రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నారా లోకేష్ అఖిల భారత ఉన్నత విద్యా సర్వేలో అగ్రగామిగా ఏపీ తమ ప్రభుత్వం వల్లే నిలిచిందని ముఖ్యమంత్రి సిగ్గులేకుండా చెబుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఏప్రిల్ 1, 2018 నుంచి 2019 మార్చి 31 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, విద్యా ప్రమాణాల ఆధారంగా సర్వే నివేదిక రూపొందించిందని, 2018- 2019 అంటే టీడీపీ హయాంలో కాదా అంటూ ప్రశ్నించారు. తప్పులైతే గత ప్రభుత్వాలపై నెట్టడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు డ్రాపవుట్స్ని తగ్గించేందుకు 2000వ సంవత్సరంలోనే మళ్లీ బడికి అనే కార్యక్రమానికి శ్రీకారం చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీకి వచ్చిన మెరుగైన ఫలితాల్లో జగన్ రెడ్డికి ఎలాంటి క్రెడిట్ లేదని, ఆయన చేసింది జీరో అని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఇకనైనా ఇతరుల ఘనతని తనదని చెప్పుకోవటం అనే వ్యసనం నుంచి బయటపడాలి అని లోకేష్ హితవు పలికారు. ఇదిలా ఉంటే విద్యారంగ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని ఉన్నత విద్యలో గరిష్ఠ స్థాయిలో చేరికలు నమోదవుతున్నాయని ఏపీ ప్రభుత్వం ఇటీవలే వెల్లడిరచింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నత విద్యా సంస్థల్లో చేరికల నిష్పత్తి అధికంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆలిండియా సర్వే హైయర్ ఎడ్యుకేషన్ గణాంకాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, జాతీయ స్థాయిలో ఏపీ ఉన్నత విద్య లో రికార్డ్ స్థాయి చేరికలతో ముందుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వెల్లడిరచారు. ఇక ఈ క్రమంలోనే నారా లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు.