రోడ్ షోలో చంద్రబాబు పిలుపు
విశాలాంధ్ర – అమరావతి: రాష్ట్రాభివృద్ధిని సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన కర్మను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేశారు. అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం, మద్దూరు, అమరావతి గ్రామాలలో చంద్రబాబు మంగళవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. పాలన చేతకాని జగన్ వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధానిని జగన్ చంపేశాడని, పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారిందని విమర్శించారు. రోడ్లు లేవు. ప్రాజెక్టులు లేవు. నవరత్నాల పేరుతో మీట నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని వక్కాణించారు. కాగా, చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. సైకిల్ రావాలి…సైకో పోవాలి అంటూ నినదించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.