చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్ఠి
జనజీవనం అస్తవ్యస్తం
నీట మునిగిన గ్రామాలు, కాలనీలు
నదులను తలపించిన తిరుపతి రహదారులు
విరిగిపడ్డ కొండచరియలు
వరదకు కొట్టుకుపోయిన వాహనాలు
తిరుమల ఘాట్రోడ్లు మూసివేత
విశాలాంధ్ర బ్యూరో ` తిరుపతి/నెల్లూరు/కడప : రాష్ట్రంలోని మూడు జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. కుంభవృష్ఠితో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో గ్రామాలు, కాలనీలు నీట మునిగాయి. గ్రామాల్లో చెరువులకు గండ్లు పడి పంటపొలాలు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. రహదారులు వరదనీటితో నిండిపోయి మూడు జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. నదులు, చెరువులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. తిరుపతి పట్టణంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రేణిగుంట
విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలను బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలో కుంభవృష్ఠి
చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.జిల్లాలోని పలు కాలనీలు, గ్రామాలు నీట మునిగాయి. తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాయి. రేణిగుంటలో దిగాల్సిన హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు హైదరాబాద్కు వెనుదిరిగాయి. భారీ వర్షాలతో తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. తిరుమల రెండు నడక మార్గాలను టిటిడి తాత్కాలికంగా మూసివేసింది. రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పునరావస చర్యల కోసం ప్రత్యేక బలగాలను జిల్లాకు రప్పించినట్లు కలెక్టర్ హరినారాయణన్ చెప్పారు. చిత్తూరు కడప జాతీయ రహదారిపై వాహన రాకపోకలు ఆగి పోయాయి. బాల పల్లి వద్ద వరద ఉధృతికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోయాయి.
నెల్లూరు జిల్లాలో…
నెల్లూరు జిల్లాలో భారీవర్షాలకు 46 మండలాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. అదేవిధంగా తీరప్రాంత మండలాల్లో అధికంగా వర్షంతో పాటు సాయంత్రంనుంచి గాలులు కూడా వీస్తుండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వెంకటగిరి, సైదాపురం మండలాల్లో కైవల్యానది పొంగిపొర్లుతుండడంతో వెంకటగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో రోడ్లపైన 3 నుంచి 4 అడుగుల ఎత్తున నీటిప్రవాహాలు ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి వద్ద నెల్లూరుకు వచ్చే రహదారిపైన పలు ప్రాంతాలలో చెట్లు విరిగి పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. సోమశిలకు ఎగువ నుంచి అధికంగా వర్షపునీరు రావడంతో అధికారులు కొన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
కడప జిల్లాలో వర్ష బీభత్సం
కడప జిల్లాలో బుధవారం రాత్రి నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం అవుతోంది.వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. చెరువులు, ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జిల్లా అంతటా ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లపై కూడా అనేక చోట్ల వంకలు, వాగులు పోటెత్తుతున్నాయి. కడప నగరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవంక ధాటికి పరీవాహక ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడప నగరం జలమయమైంది. ఆర్టీసీ బస్టాండు, అప్సర రోడ్డు అవతలి వైపు పట్టణమంతా నీట మునిగింది. కడప`తిరుపతి ప్రధాన రహదారిలో కోడూరు, కుక్కలదొడ్డి మధ్యలో ప్రధాన రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు వాహనాలు ఇరుక్కుపోవడంతో పాటు ఒక వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.